11. పరిచర్య - ప్రవచనము

11. పరిచర్య - ప్రవచనము

    ''ఆయన మనలను క్రీస్తు  ద్వారా తనతో సమాధాన పరచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు (అపొస్తలులకు) అనుగ్రహించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనునట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్ములను బ్రతిమాలుకొను చున్నాము'' (2కొరింథి 5:18,20). దేవుని అనుగ్రహముతో విశ్వాసులు క్రీస్తుగా మారునట్లు అపొస్తలులు క్రీస్తు తరఫున పరిచర్య చేయుదురు. అయినను ఈ పరిచర్య అన్యజనులైన వారికి కూడా జరుపబడుచున్నది. విశ్వాసులలో నున్న భేదమును బట్టి పరిచర్య అనేక విధములు. ఈ పరిచర్య వేడుకొనునట్లు, బ్రతిమాలు చున్నట్లు, హెచ్చరించుచున్నట్లు, భాషించుచున్నట్లు, బోధించుచున్నట్లు, చివరిగా ప్రవచించుచున్నట్లు జరుగును. అపొస్తలులు ఈ విధముగా సమస్త జనులకు క్రీస్తు తరఫున రాయ బారులై ఉన్నారు.

    ''ప్రవచన వరమైతే విశ్వాసపు పరిమాణము చొప్పున  ప్రవచింతురు. పరిచర్యయైతే పరిచర్యలోను, బోధించువారైతే బోధించుటలోను , హెచ్చరించువారైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందురు, పంచి పెట్టు వాడును శుద్ధమనస్సుతోను, పైవిచారణ చేయు వాడు జాగ్రత్తతోను, కరుణించు వాడు సంతోషముతోను పని జరిపించ వలెను. పరిచర్య ప్రేమతో జరుప వలెను. పరిచర్య ప్రభువును సేవించుటయే. ఆత్మ యందు తీవ్రత కలవారై నిరీక్షణ కలవారౖౖె సంతోషించుచు శ్రమయందు ఓర్పుగలవారై ప్రార్ధనయందు పట్టుదల కలవారై ఉండవలెనని తెలుప బడెను.'' (రోమా 12:7,8,11,12).

    పరిచర్య చేయు వారు అందరిని ప్రేమించు వారై ఉండ వలెను. జనులు చెడ్డ వారు, వివాదము రేపు వారు, అవిశ్వాసులు, సహనము లేనివారు అని అనేక విధములుగా నున్నప్పటికిని, వాటిని యెంచక ప్రేమ కలిగినవారై యుండ వలెను. పరిచర్యులు వారు చేయు సహవాస కార్యక్రమము దేవుని కొరకు జరిపించు చున్నట్లు ఉండ వలెను. తనకేమి జరిగినను ధైర్యముతోను, ఓర్పుతోను దైవ కార్యమగు పరిచర్యను విధేయతతో చేయ వలెను. శరీరానుసారులను ఆత్మానుసారులుగా మార్చుటకు చేయు పరిచర్య తాను ఆత్మ యందుండి జరుపునదిగా ఉండ వలెను. విశ్వాసి క్రీస్తుగా మారవలసిన పరిచర్య, తాను  పరిశుద్ధాత్మగా  నుండి జరుపవలెను. పరిచర్య చేయు వారు శరీరానుసారులు కాదు, ఆత్మానుసారులును కాదు, కనీసము ఆత్మయందున్న వారుగా నుండ వలెను.

    ఇంను యీలాగు చెప్పబడినది. ''వాక్యముచేతను, క్రియ చేతను, గురుతుల బలముచేతను, మహత్కార్యముల బలము చేతను, క్రీస్తు ద్వారా చేయించిన వాటిని గూర్చియేగాని మరిదేనిని గూర్చియు మాటలాడ తెగింప రాదు'' (రోమా 15:19). పరిచర్య కొరకు ఆధారమును ఋజువును చూపునట్లుగా వారు దేవుని వాక్యము ద్వారా సత్యమును తెలియ జేయ వలెను. ఆయన మార్గమును చూపించ గల ప్రేమ, కరుణలను విశద పరచుట ద్వారా సత్యము యొక్క లక్షణమును తెలియజేయ వలెను. మనకు తెలిసిన దేని నుండైనను ప్రారంభించి మూల కారణమైన సత్యమును నిరూపించ వలెను. అనగా శరీరానుసారమైన వారికి బాగుగా తెలిసిన స్ధూల , సూక్ష్మ శరీరములను వివరించి, అటులనే లోకములను వివరించి, వీటన్నింటికి ఆధారమైన దేవ దూతల కార్యమును, వారికి ఆధారమైన దేవుని గురించి తెలుపుట ద్వారా సత్యమును తెలియ జేయ వలెను. ఈ విధముగా సత్యము యొక్క ఉనికిని ఋజువు పరచగల గుర్తులను తెలియజేయ వలెను. ప్రభువు చూపించిన మహత్తులను చెప్పుచు, గొప్పదైన సత్యస్వరూప మెట్టిదో చెప్పవీలగును. చివరగా తాను చేయు పరిచర్య తనకు తానుగా జరుపుట లేదనియు, అది క్రీస్తు ద్వారానే జరుప బడుచున్నదనియు చెప్పి, దానిని ప్రమాణముగా స్వీకరించునట్లు ప్రయత్నించ వలెను. ఎందుకనగా క్రీస్తు యేసే సత్యమునకు ప్రమాణము మరియు  ఎవరెన్ని బోధించినను, యేవిధముగా పరిచర్య చేసినను అవి అన్నియు క్రీస్తు ద్వారానే జరుప బడుచున్నవని తెలియ వలెను.

    ''యెహోవా ఆత్మ నాద్వారా పలుకు చున్నాడు. ఆయన వాక్కు నా నోట ఉన్నది.''

(2 సమూయులు 23:2) అని దావీదు అను దైవజనుడనెను.

    ''ఒక్కడే బోధకుడు, మీరందరును సహోదరులు. ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. క్రీస్తు ఒక్కడే మీకు గురువు'' (మత్తయి 23:8,9,10).  బోధకులందరు దైవముచే స్ఫురించిన వాక్యములనే చెప్పుచుందురు కనుక, మనము బోధకుల బోధను శరీరానుసార వాక్యముగా నెంచక, క్రీస్తు యేసు వాక్యమే మనకు అందించ బడు చున్నదని తెలియ వలెను. అందు వలన బోధకులు ఎందరైనను ఒక్కడేనని యెంచి, అతడు క్రీస్తు అను గురువని తెలియ వలెను. మనమందరమును దేవుని బిడ్డలమైనందున క్రీస్తు జ్యేష్ట కుమారుడనియు, మనము సహోదరులమనియు భావించుటయే సత్యము. బోధకుడైనను,  క్రీస్తైనను, మనమైనను, హెచ్చు తక్కువలు లేక, తండ్రి విషయములో అందరికిని ఆయన ఒక్కడే, అతడే యెహోవా. పవిత్రమైన శరీరధారియైన క్రీస్తే మనలను తండ్రి యొద్దకు చేర్చగల అధికారియై నందున క్రీస్తు మనకు గురువు కూడా అయి ఉన్నాడు.  తండ్రి వాక్యమే క్రీస్తు వాక్యము. క్రీస్తు బోధే తండ్రి బోధ. క్రీస్తు గురువు తప్ప మిగిలిన వారందరు ఆయన ప్రతినిధులు మరియు ఆయన స్ఫూర్తితో ప్రవచించు వారే గాని, వారికి వారే బోధకులు కాదు. క్రీస్తు బోధ యందు ''కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవిగాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు ఉన్నవిగాని అందరిలోను అన్నీ జరిపించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనముల కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించ బడుచున్నది. ఏలయనగా ఒకనికి ఆత్మమూలమునైన బుద్ధి వాక్యమును , మరియొకనికి ఆత్మననుసరించిన జ్ఞాన వాక్యమును, ఆత్మ వలననే విశ్వాసమును యింకొకరికిని, మరియొకనికి ఆ ఆత్మ వలననే స్వస్థ పరచు వరములను, అద్భుత కార్యములు చేయు శక్తియు, ప్రవచన వరమును, యీలాగున ఒక్కొక్క బోధకునికి ఒక్కొక్క విధముగా అనుగ్రహించుచున్నాడు. అయినను ఆత్మ ఒక్కడే తన చిత్తము (దేవుని చిత్తము) చొప్పున ప్రతివానికిని ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగ జేయుచున్నాడు'' (1కొరింథి 12:4-11).

    బోధకులు అనేక విధములుగా నున్నారు. ఎందుకనగా సాధకులు కాని వారును, సాధనచే క్రీస్తు మార్గములో నడచుచున్న వారును కూడా అనేక విధములుగా నున్నారు. అట్టి జనుల స్ధాయిని బట్టి ఎవరికి ఏవిధమైన బోధ అవసరమై యున్నదో, దానిని అందించుటకు ఈ బోధకులు ముఖ్యముగా నాల్గు స్ధాయిలలో నియమించ బడిరి. అది యెట్లనగా అంధ మనస్సు కలిగి తమోగుణులుగా నున్న అన్య జనుల కొరకును, దైవము గురించి తెలిసి నప్పటికిని రజోగుణము వలన దేవుని నమ్మని అవిశ్వాసుల కొరకును, ఒక బోధకుడుండును. ఇతడు సత్వ గుణములో నున్న విశ్వాసిగా అనుభవించుచు, దైవ వాక్యమును అందించు చుండును. ఈ విశ్వాసియైన బోధకుని ద్వారా అన్యజనులును, అవిశ్వాసులును విశ్వాసులుగా మార గలరు. దీని కొరకు ఆత్మ మూలమైన బుద్ధి వాక్యము అందించ బడును.

    విశ్వాసి అయిన వాడు ఆత్మానుసారముగా నడచుకొనును. అతనికి ఆత్మను అనుసరించుటకు అవసరమైన జ్ఞానము నిచ్చువాడు కాపరియైన బోధకుడు. బోధకుడు ఆత్మానుభవములో నుండును.  ఇతడు చేయు బోధ క్రీస్తు అనుసరించిన జ్ఞాన వాక్యముగా నుండును.  

    క్రీస్తు యేసు స్థితి నందుండు వాడు  ప్రవక్త. ఈ బోధకుడు జ్ఞానము నొందిన సాధకునికి క్రియా మూలమైన విశ్వాసమునకు బదులుగా ఆత్మ వలననే విశ్వాసి యగునట్లు మార్చును. అందు కవసరమైన దేవుని వాక్యము అందించ బడును. సాధకుడు క్రీస్తుగా మారును.

    యేసు క్రీస్తుతో సమానమైన ఆయనతో ఐక్యత నొందిన వాడును, ఆయనచే నియమించ బడిన వాడు, అతడే అపొస్తలుడు. ఇతడు ప్రవచనము చేయ గలడు. తన అనుభవముతో క్రీస్తుగా మారిన వారిని క్రీస్తు యేసు నందు ప్రవేశఙంప జేయుటకు సమర్ధుడు. దీనినే ఆత్మ వలన స్వస్థ పరచుట అందురు.

    యేసు క్రీస్తు ద్వారా జరుప బడిన అద్భుతములను తానును చేయ గలిగిన శక్తి కలిగిన బోధకులు కొందరు గలరు. వారు బాధలలో నున్న వారికి స్వస్థతను చేకూర్చుట ద్వారా అవిశ్వాసులను విశ్వాసులుగా మార్చ గలరు. ఈ విధముగా బోధకులు ఎన్ని విధములుగా నున్నను, వారు అందించు వాక్యము ఎన్ని విధములుగా నున్నను, బోధకుడు ఒక్కడే. వాక్యము ఒక్కటే. తండ్రియు ఒక్కడే. ఆత్మయు ఒక్కడే. ఎందుకనగా దైవ జనులైన బోధకులు అన్ని స్థాయిలలోను దైవము నుండి లభించు స్ఫూర్తి వలననే దేవుని వాక్యమునందించు చున్నారు. ఈ వాక్యము స్థాయిని బట్టి బుద్ధి వాక్యములు, జ్ఞాన వాక్యములు , స్వస్థత వాక్యములు మరియు పరిచర్యలుగా నున్నవి.

    పరిచర్య అందరికిని ఉద్దేశించ బడినది. అన్యజనులు దీనిని నాలుగు విధములుగా స్వీకరించెదరు.

    ''ఎవడైనను (పరలోక) రాజ్యమును గూర్చిన వాక్యము వినియు దానిని గ్రహింపక యుండగా దుష్టుడు వచి ్చవాని హృదయములో విత్తబడిన దానిని యెత్తుకు పోవును. త్రోవ ప్రక్కన విత్త బడినవాడు వీడే.

    రాతి నేలన విత్తబడినవాడు వాక్యము వినిన వెంటనే సంతోషముతో దానిని అంగీకరించు వాడు. అయితే అతనిలో వేరు లేనందున అతను కొంత కాలము నిలుచును గాని, వాక్యము నిమిత్తము శ్రమయైనను, హింసయైనను కలుగ గానే అభ్యంతర పడును.

    ముండ్ల పొదలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును, ధనమోహమును ఆ వాక్యమును అణచి వేయును గనుక వాడు నిష్పలుడగును.

    మంచి నేలన విత్తబడిన వాడు సఫలుడై యొకడు నూరంతలుగాను, ఒకడు అరువదంతలు గాను, ఒకడు ముప్పదంతలుగాను ఫలించును.'' (మత్తయి 13:19-23).

    అన్యజనులైన వారిలో  దేవుని వాక్యమును స్వీకరించుటలోను, విన్న దానిని గ్రహించుటలోను, గ్రహించిన దానిని విచారణ చేయుటలోను మరియు వాక్యానుసారము నడచు కొనుటలోను కొందరు విఫలమగుచున్నారు.

    ఒక విత్తనము త్రోవ ప్రక్క పడినచో అందరు దానిని త్రొక్కుటచేత అది మొలవదు, అటులనే వాక్యము కొందరి చెవులలో పడినను, ప్రాపంచిక విషయములు అతడిలో తిష్ఠ వేసి ఉన్నందున ఆ వాక్యము ఫలించదు. అట్లే దుష్టుని సహవాసము వలన విన్న వాక్యము నిరర్ధకమగును.

    రాతి నేలపై విత్తబడిన విత్తనమునకు వేరు ఏర్పడదు. అందుచే వాక్యమును ఇతడు సంతోషముగా అంగీకరించును కాని వేరు కలగనందున అది అంకురించదు. ఈ వాక్యము కొంత కాల మతనిలో నుండును గాని, అతనికి వాక్యము నిమిత్తము శ్రమకలిగినను, ఇతరులచే కష్టనష్టములు  కలిగినను ఆ వాక్యమును విడచి వేయును.

    ముండ్ల పొదలలో నాటబడిన విత్తనమునకు బలము చేకూరక, బదులుగా ముండ్ల చెట్లు బలముగా పెరుగును. ఈ ముండ్ల చెట్లు, నాట బడిన విత్తనమును పెరగ నీయవు. అటులనే ధన వ్యామోహము, భార్యా బిడ్డలపై వ్యామోహము, కీర్తి ప్రతిష్ళలకై పాకులాడుట వంటివిని, వీటి కొరకై తాను ఏర్పాటు చేసికొన్న యితరులతో నిరంతరము వ్యవహరించు చుండుట వలన, వాక్యము అణచి వేయ బడి నిష్ఫలమగును.

    మంచి నేల యనగా, వాక్యమును గ్రహించి, విచారణ చేసి, వాక్యానుసారము జీవించు బుద్ధి. ఇక్కడ వాక్యము అంకురించి, లోతైన వేరు కలిగి, మఱ్ఱి చెట్టు విస్తరించి నట్లుగా తాను విశ్వాసిగా మారి, క్రీస్తుగా మారి, ఆయన ప్రజలుగా నెంచ బడును.

    మంచి నేల వంటి అంత:కరణను సంపాదించ వలెననిన (1) దైవమును తెలిసికొన వలెనను       తలంపు కలిగినంతనే, ఆ తలంపును అణచు కొనరాదు. (2) వాక్య రహస్యములను తెలిసి  కొనునప్పుడు దుష్ట సాంగత్యమును కొనసాగించక, సజ్జన సాంగత్యము కొరకు ప్రయాస పడ వలెను. (3) సాతాను సంబంధ స్వభావమును విడచి, దాని ప్రభావమునకు లోనవ రాదు. (4) లోక విషయములు, ధనాపేక్ష మొదలగునవి దైవానికి విరోధమని యెంచి, దైవము వైపుకు తిరగ వలెను. ఈ విధముగా తలపులలోను, మాటలలోను, చేతలలోను పాటించ వలెను.

    ఇంను పరిమిత పరచ బడిన అంత:కరణము వలన కులము, బలము, యౌవ్వనము, ఆస్తి పాస్తులు, సంపద, తెలివి తేటలు, జ్ఞానము అనునవి ఇతరుల కంటె తన కెక్కువ అను అహంకారమును, లేదా ఇతరుల కంటె తనకు తక్కువ అను దీనత్వమును కలిగియుండ రాదు. మరియు తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు, సోదరులు, ధనము, మిత్రులు, తన శరీర సౌఖ్యము అను  ఎనిమిది  విధములైన పాశములచే బంధించ బడరాదు.

    వాక్యము విను నప్పుడు తన దేహ సంబంధ, లోక సంబంధ ధ్యాసను విడచి మరియు యింతకు ముందు తాను వినిన విమత బోధలతో తనకు కలిగిన భావనను సైతము వదల వలెను. ఈ మూడు ధ్యాసలు సాధకుని సరిగా విన నీయవు, గ్రహింపనీయవు కనుక వీటిని విడచిన వాడే అంత:కరణ శుద్ధి కలవాడు, అనగా సారవంతమైన మంచి నేల. కనుక పరిచర్య ఫలించుట అనగా మంచి నేలపై విత్తబడిన వాక్యము. ఇతడే అచంచల విశ్వాసముతో  క్రీస్తు స్థితినొందును. దీనిని క్రీస్తును సంపాదించు కొనుట అనబడును.

    ''క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమూలమైన నీతిని గాక, క్రీస్తు నందలి విశ్వాసము వలననైన  నీతి గలవాడై, ఏవిధము చేతనైనను మృతులలోనుండి పునరుత్థానము కలుగ వలెనని....., సమస్తమును (లోక సంబంధమైన వాటిని) నష్ట పరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొన వలెను.'' (ఫిలిప్పీ 3:9-11). అయినను, అతడు భాషణ వలన గాక, ప్రవచనము మూలముగానే క్రీస్తు యేసు నందు ప్రవేశించును. భాషించుటకును ప్రవచనమునకు భేధము తెలియ వలెను.

    ''ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదు. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛను బట్టి కలుగ లేదు. కాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించ బడినవారై దేవుని మూలముగా పలికిరి.''(2పేతురు 1:20,21) అపొస్తలులు మరియు పరిచర్య చేత , తన ఊహ వలన పుట్టినది భాష యగును. భాషించుట వేరు, ప్రవచించుట వేరు.

    ''ప్రవచించుట అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకు సూచక మగును.'' ప్రవచనము క్రీస్తు లోకము నుండి దేవుని వలన అందింపబడును. ప్రవచనము వలన క్రీస్తుయేసు నందున్న విశ్వాసులు దైవత్వము నొందుదురు. ''భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచకమగును.'' భాషవలన అవిశ్వాసి సాత్వికుడగును. అవిశ్వాసి ప్రవచనము వినుట వలన తాను పాపినని (శరీరమే సత్యమని పొరపడితినని) తెలిసికొనును. దేవునిపై విశ్వాసము కలిగి విశ్వాసిగా మారును. ఇంను ''హృదయరహస్యము బయలు పడును. అందువలన దేవుడు నిజముగా తనలోనే ఉన్నాడని అతనికి ప్రచురమగును'' (1కొరింథి 14:22,23,25).

    ప్రవచనము అందరిలోను తగిన మార్పు ననుగ్రహించునని స్పష్టమగు చున్నది. సువార్తయే ప్రవచనము. ఇది సమస్త జనులకు ఉద్దేశించ బడినది.

    ''సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా నుంచ బడి, యిప్పుడు ప్రత్యక్ష పరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలియజేయునదే ప్రవచనము'' (రోమా 16:25-27).

    అనాది నుండి అనగా పాత నిబంధన కాలము. అప్పుడైతే విశ్వాసము అనునది దేవుని నామముపై నుండినది. అది భక్తితో అంతమైనది. అప్పుడు జ్ఞానము రహస్యముగా నుంచ బడినది. నూతన నిబంధన కాలమందు క్రీస్తు మార్గము తెలియ జేయ బడినది. దీని వలన జ్ఞానము కలుగును. ప్రాచీన కాలమందు క్రియా మూల విశ్వాసమే యున్నది. ఇప్పుడైతే ఆ విశ్వాసము అదృశ్యుడగు దేవుని తెలిసికొనదగిన విశ్వాసము, పిమ్మట అనుభవములోనికి చేర్చగల విశ్వాసము. ఇట్టి విశ్వాసమునకు విధేయత అనగా జ్ఞానము వలన ఎరిగిన దైవమునకు సర్వ సమర్పణ గావించు కొనుట. సర్వ సమర్పణ యనగా, తన శరీరమునకును, లోకమునకు సంబంధించిన వానిని అర్పణ చేయుట. అప్పుడైతే దైవమునకును విశ్వాసికిని అనుభవములో బేధము ఉండదు. ఇదియే అప్పటి నుండి రహస్యముగా నుంచబడిన మర్మము.

    ఈ మర్మమును విప్పునదే సువార్త. దైవజనులు పరిశుద్ధాత్మ ప్రేరణతోనే ప్రవచింతురు కనుక వారి ప్రవచితములు దేవుని వాక్యములగును. ''దైవ జనులగుట ఎట్లనిన దైవజనులు నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడవలెను'' (1తిమోతి 6:11-12).

    ఏ నరుడైనను దైవ జనులగుట సాధ్య పడును. దీని కొరకు దేవుని నీతిని, దేవుని యందు భక్తి విశ్వాసములను, ప్రేమ, సహనము, ఓర్పు, త్యాగము, నిగ్రహించు సమర్థతలను సాధించ వలెను. ఇట్టి వారి అంత:కరణ విశాల పరచ బడి, సంకుచితమగు వ్యక్తిత్వము నశించును. అందువలన వీరిలో దైవము వాక్యముగా ప్రవేశించును. అప్పుడే దైవ జనుడు పరిశుద్ధాత్మకు తన యందు చోటు కల్పించు కొనును. పరిశుద్ధాత్మచే అభిషేకించ బడిన దైవ జనుల మనస్సును, మాటలును తనవి కాక, దైవమునకు సంబంధించినవే అగును. కనుక వీరు ఉచ్ఛరించు వాక్యములు భాషణ గాక ప్రవచనములగును.

    దైవజనుని అధికారమేమనిన, ''దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజన కరమై ఉండును.'' (2తిమోతి 3:16,17). ఎందుకనగా ఇతడు భాషించుట లేదు. దేవుడు అందించునదే  చెప్పు చున్నాడు. కనుక అంతయు దేవుని సంకల్పమైనందున, దైవ జనుడు యేసుక్రీస్తు వలె సర్వాధికారియగును. దైవ జనులు ఉచ్ఛరించు వాక్యములు అందరికిని, అన్ని విధముల అందించ   బడును. కాని ప్రవచించ గల దైవ జనులు వేరుగా నున్నారు.

    ప్రధాన యాజకుడైన ప్రభువుచే నియమించ బడిన దైవజనులు మాత్రము ప్రవచింపగలరు. ఎందుకనగా యేసే ప్రధాన యాజకుడు. '' దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకున్నాడు.'' (హెబ్రి 4:14)

    యేసే ప్రధమ అపొస్తలుడు. ''అపొస్తలుడును ప్రధానయాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి.'' (హెబ్రి 3:1). ''ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను, యాజకులుగాను చేసెను.'' (ప్రకటన 1:6).

    ''ఈయన నిరంతరము ఉండువాడు కనుక మార్పులేని యాజకత్వము కలిగినవాడాయెను.'' (హెబ్రి 7:24). కనుక ఆయన వల్లనే దైవజనులు యాజకులై ప్రవచించ గలుగుచున్నారు. అందువలన అదృష్టవంతులైన విశ్వాసులు  ప్రవచనము వలన ఆత్మను బల పరచుకొని శరీర భావము నుండి విమోచన నొందుదురు. కనుక ''ప్రవచన వాక్యము గైకొనువాడు ధన్యుడు'' (ప్రకటన 22:7). ఎందుకనగా ప్రవచనము ద్వారా దివ్యానుభవము లభించును.